మళ్లీ సెంటిమెంట్‌ను రగిలిస్తున్నారు.. సజ్జల కామెంట్స్‌పై ​భట్టి ఫైర్

by Disha Web Desk |
మళ్లీ సెంటిమెంట్‌ను రగిలిస్తున్నారు.. సజ్జల కామెంట్స్‌పై ​భట్టి ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ సెంటిమెంట్​రగిలించే కుట్ర జరుగుతుందని, రాజకీయాల్లో నిరంతరం కాన్స్పెసిస్​నడుస్తూనే ఉంటాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ ప్రజలు స్వరాష్ట్రం కోరుకున్నారు కాబట్టే కాంగ్రెస్​పార్టీ తెలంగాణ ఇచ్చిందన్నారు. అయితే, ఇప్పుడు సమైక్య రాష్ట్రం నినాదంపై సజ్జల రామకృష్ణ చేసిన కామెంట్స్ ఆయన వ్యక్తిగతమన్నారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ఏపీ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్‌పై ఆయన మండిపడ్డారు. ఇరు రాష్ట్రాల్లో మళ్లీ సెంటిమెంట్​రగలించి రాజకీయ ప్రయోజనాలు పొందే ప్రయత్నాలు చేస్తున్నారని, సమైక్య నినాదం ఇవ్వాళ కొత్త కాదని, రాష్ట్ర విజభన జరిగినప్పుడు కూడా ఏపీ వాళ్ళు అదే అన్నారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు, ఆలోచనలకు భిన్నంగా సజ్జల కామెంట్స్ ఉన్నాయని, మళ్ళీ సమైక్య రాష్ట్ర నినాదం అనే వాదనతో ఉపయోగం లేదని, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆ వ్యాఖ్యలకు వ్యతిరేకమని స్పష్టం చేశారు.

ఇక, హిమాచల్ ప్రదేశ్‌లో మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం దేశంలో మారుతున్న రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతుందని భట్టి విక్రమార్క చెప్పారు. ప్రధాని మోడీ చేస్తున్న ఆకృత్యాలు, ఆరాచకాలను సహించలేని హిమాచల్ ప్రదేశ్ ప్రజలు బీజేపీని ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించారని, గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలున్నప్పటికీ దేశ ప్రధాని, దేశ అధికార యంత్రాగం గుజరాత్‌లో మోహరించి అధికార దుర్వినియోగానికి పాల్పడి తప్పుడు ప్రచారంతో విజయం సాధించిన బీజేపీది నైతిక గెలుపు కాదని, ఎన్నికల ప్రచారంలో మోడీ ప్రధాని స్థాయి మర్చిపోయి గుజరాత్ ప్రతినిధిలా మాట్లాడారని విమర్శించారు. డబ్బు, అధికారం, మీడియాలో తప్పుడు ప్రచారం చేసి గుజరాత్ లో బీజేపీ విజయం సాధించిందని, దేశ వనరులు అన్ని గుజరాత్ లో కుమ్మరించారని, దేశ సందపను దోచిపెట్టిన క్రోని క్యాప్టలిస్టులను గుజరాత్ లో మోహరించి ఆనేక ప్రలోభాలు పెట్టి గెలిచినా విజయం ఎలా అవుతుందని భట్టి ప్రశ్నించారు.

బీజేపీపై నమ్మకంతో గుజరాతీలు ఓట్లు వేసినట్లుగా కనిపించడం లేదని, ఎంఐఎం, ఆప్ లాంటి పార్టీలను బీజేపీ ప్రోత్సహించి లౌఖికవాద ఓట్లను చీల్చి గుజరాత్ లో గెలిచారన్నారు. ఒక ప్రధాని తన స్థాయిని దిగజార్చుకొని ఎన్నిక కోసం ఒక రాష్ట్రంలో 36 సభలకు పైగా పాల్గొన్న దుష్టాంతం దేశంలో ఇప్పటి వరకు చూడలేదని, దేశాన్ని పాలించే ప్రధాని దేశాన్ని ఒకే విధంగా చూడాలని, తాను భూమి పుత్రిడిని అంటూ గుజరాత్‌లో మోడీ భావోద్వేగాన్ని రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ధి పొందారని విమర్శించారు. ఎంఐఎం, ఆప్ పార్టీలు బీజేపీ ట్రాప్‌లో పడి గుజరాత్ ఎన్నికల్లో బీజేపీకి సహాకరించాయని భట్టి ఆరోపించారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న జోడో యాత్ర ఎన్నికల కోసం చేసే యాత్ర కాదని, విచ్చిన్నకర శక్తులను నుంచి దేశాన్ని ఐక్యం చేసేందుకు జరుగుతున్న యాత్ర అని, ముందుస్తుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే రాహుల్ పాదయాత్ర నడుస్తున్నదని వెల్లడించారు. గుజరాత్ ఓటమికి మొన్ననే కాంగ్రెస్ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన ఖర్గే బాధ్యుడు కారని, గుజరాత్ ఓటమికి కాంగ్రెస్ మొత్తం బాధ్యత వహించాలన్నారు. గుజరాత్ లో గెలుపు స్ఫూర్తితో తెలంగాణలో గెలుస్తామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితుల్లో మార్పులు తీసుకురాకుండా అధికారంలోకి వస్తే చాలు అనుకునే సంజయ్ ఎప్పుడు అధికారం కోసం వెంపర్లాడినట్టుగానే వ్యాఖ్యలు ఉంటాయన్నారు.

త్వరలోనే కమిటీలు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కమిటీల నియామకంపై కసరత్తు జరుగుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. ఈ కమిటీల ఏర్పాటుపై తన అభిప్రాయం కూడా చెప్పానని, సీనియారిటీ, అనుభవం ప్రాతిపదిక ప్రకారమే కమిటీల్లో స్థానం కల్పించాలని చెప్పామన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంకా కాంగ్రెస్​పార్టీలోనే ఉన్నారని, క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసు ఇచ్చిందన్నారు.

READ MORE

పొన్నూరులో Chandrababu కీలక వ్యాఖ్యలు.. రోడ్ షోకు పోటెత్తిన జనం


Next Story